నీటి కొరత సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఓ 13 ఏళ్ల విద్యార్థి చేసిన ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాకు చెందిన రాయ్ కిమ్ అనే విద్యార్థి.. గాలిలో ఉండే తేమను సేకరించి స్వచ్ఛమైన నీటిగా మార్చే ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేశాడు.
ఈ వినూత్న పరికరం పెల్టియర్ మాడ్యూల్, తేమను గుర్తించే సెన్సార్ల సహాయంతో పనిచేస్తుంది. ముందుగా గాలిని చల్లబరిచి అందులోని తేమను నీటి బిందువులుగా మార్చి సేకరిస్తుంది. అనంతరం ఆ నీటిని మొక్కలకు నేరుగా అందించే విధంగా పరికరాన్ని రూపొందించాడు.
వ్యవసాయ రంగంలో నీటి కొరత ఎదుర్కొంటున్న కరువు ప్రాంతాలకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తక్కువ వనరులతో పంటలకు అవసరమైన నీటిని అందించే మార్గంగా ఇది భవిష్యత్తులో కీలకంగా మారొచ్చని చెబుతున్నారు.
రాయ్ కిమ్ రూపొందించిన ఈ ప్రాజెక్ట్ అతడికి ప్రతిష్టాత్మక 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ పోటీలో గుర్తింపు తెచ్చింది. ఈ పోటీలో అతడు టాప్-10 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచాడు.
చిన్న వయసులోనే నీటి సమస్యకు సాంకేతిక పరిష్కారం చూపేందుకు ప్రయత్నించిన రాయ్ కిమ్ ఆవిష్కరణ.. భవిష్యత్లో నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయానికి కొత్త మార్గాలను తెరవొచ్చని ఆశిస్తున్నారు.
also read: తమిళనాడు ఎక్స్ప్రెస్లో మిస్టరీ.. ట్రాలీ బ్యాగ్లో మృతదేహం
