క్రైమ్ మిర్రర్ : పౌరాణిక సీరియల్ ‘మహాభారత్’లో భీముడి పాత్రతో గుర్తింపు పొందిన ప్రముఖ అంతర్జాతీయ రెజ్లర్, నటుడు సౌరవ్ గుజ్జర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
బాధితురాలి కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఆమె గత ఏడాదికాలంగా హైదరాబాద్లో నివాసముంటోంది. 2016లోనే భర్తకు విడాకులు ఇచ్చిన ఆమెకు, 2021లో అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా సౌరవ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనను భార్యలా చూసుకుంటానని నమ్మబలికి కొన్ని నెలల పాటు తనతోనే ఉంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది.
బాధితురాలి ఫిర్యాదుతో అప్రమత్తమైన గచ్చిబౌలి పోలీసులు సౌరవ్ గుజ్జర్పై కేసు నమోదు చేసి ముందస్తుగా ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన సౌరవ్ను అక్కడి విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముంబై మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. శనివారం ఆయనను అధికారికంగా అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు పంపారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో ఉన్న మహవీర్పురకు చెందిన సౌరవ్ గుజ్జర్, హిందీలో సంచలనం సృష్టించిన ‘మహాభారత్’ సీరియల్లో భీముడి పాత్ర ద్వారా విశేష ఆదరణ పొందారు. దాంతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ, అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లలోనూ ప్రతిభ చూపి మంచి పేరు సంపాదించుకున్నారు.
also read : ఎయిర్పోర్ట్ సమీపంలో ఇంధన డిపో ధ్వంసం, వణికిపోయిన సౌదీ!
