క్రైమ్ మిర్రర్ : విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. తోటి ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మలేసియా నుంచి కేరళకు వస్తున్న బతిక్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. కౌలాలంపూర్ నుంచి కోచి వస్తున్న బతిక్ ఎయిర్ ఫ్లైట్ OD231లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, కేరళలోని కూటన్నాడ్కు చెందిన జంషీర్ అతనిక్కల్ అనే ప్రయాణికుడు విమానం గాల్లో ఉన్న సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. రాత్రి సుమారు 9:30 గంటల నుంచి 11:05 గంటల మధ్య అతడి ప్రవర్తనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విమానం తలుపు తెరవొద్దని ప్రయాణికులు అతడిని అడ్డుకోగా, వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. విమానం రాత్రి 2:40 గంటలకు కోచి అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటన గురించి ముందుగానే సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానం దిగిన వెంటనే జంషీర్ను అదుపులోకి తీసుకుని నెడుంబస్సెరి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై బీఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్లతో పాటు విమాన భద్రతకు సంబంధించిన చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ప్రయాణికుడి చర్యల కారణంగా విమానంలోని ఓ విండో ప్యానెల్ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం విమానయాన సంస్థ సిబ్బంది తనిఖీలు నిర్వహించి అవసరమైన మరమ్మతులు చేపట్టారు. విమానం ప్రయాణానికి సురక్షితంగా ఉందని అధికారులు ప్రకటించారు. విమాన సిబ్బంది సమయానికి స్పందించి పరిస్థితిని నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
also read : బీఆర్ఎస్ మహిళా నేత రూపా రెడ్డి అరెస్ట్..
