వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రి మార్చురీకి తరలించగా.. అక్కడ ఎలుకలు కంటి భాగాన్ని కొరికినట్లు బంధువులు గుర్తించారు.
రాయపర్తి మండలానికి చెందిన గారే వీరయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని శవపరీక్ష గదికి తరలించారు. ఆదివారం ఉదయం మృతుడి బంధువులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా.. కంటి భాగం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఎలుకలు కొరికిన కారణంగానే ఇలా జరిగిందని వారు ఆరోపించారు.
మృతదేహాలను భద్రపరిచేందుకు పోస్టుమార్టం గదిలో తగిన ఫ్రీజర్ సదుపాయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు.. ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజర్, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.
also read: కెనాల్లో యువతి మొండెం: గాలింపులో ఒక్కొక్కటిగా లభిస్తున్న శరీర భాగాలు
