ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ఇటీవల వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న మెటా.. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ (DOB) ధృవీకరణ ఫీచర్ను భారతదేశంలో పరిమిత సంఖ్యలోని వినియోగదారులపై టెస్టింగ్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఫీచర్ భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం కొంతమంది యూజర్లకు వాట్సప్ ఓ ప్రాంప్ట్ చూపిస్తూ తమ పుట్టిన తేదీని నమోదు చేయాలని సూచిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయకపోయినా వాట్సప్ను ఉపయోగించడంపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.అయితే భవిష్యత్తులో భారతదేశంలో అమల్లోకి వస్తున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టానికి అనుగుణంగా ఈ ప్రక్రియ తప్పనిసరి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా 18 ఏళ్లలోపు వినియోగదారులను గుర్తించడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేందుకు అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో భాగంగా ఈ ఫీచర్ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్చరణ్-సుకుమార్ మూవీలో కన్నడ భామ.. ఆ క్రేజీ హీరోయిన్కే ఛాన్స్?
ఈ విషయంపై స్పందించిన వాట్సప్ ప్రతినిధులు ప్రస్తుతం కేవలం ఫీచర్ పనితీరును మాత్రమే పరీక్షిస్తున్నామని తెలిపారు. యూజర్ల వయస్సును తప్పనిసరిగా అడుగుతున్నామని లేదా డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయకపోతే వాట్సప్ సేవలు నిలిపివేస్తామని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అలాగే వినియోగదారులు నమోదు చేసే పుట్టిన తేదీని ఇతరులకు కనిపించేలా చేయబోమని కూడా వెల్లడించారు.డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించే డిజిటల్ ప్లాట్ఫారమ్లు వారి వయస్సును నిర్ధారించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ నిబంధనలకు అనుగుణంగా వాట్సప్ ముందస్తు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా, దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చిన్నపిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ అంశంపై ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నాయి. అంతేకాదు, ఆస్ట్రేలియా సహా కొన్ని దేశాలు కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి వయస్సు ధృవీకరణ ప్రక్రియ మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అయితే ప్రస్తుతం వాట్సప్లో డేట్ ఆఫ్ బర్త్ నమోదు కేవలం టెస్టింగ్ దశలో మాత్రమే ఉందని, దీనిపై అధికారికంగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
మహేశ్ బర్త్డే స్పెషల్.. వారణాసి నుంచి రుద్ర మాస్ లుక్.. పోస్టర్లు చూస్తే గూస్బంప్సే!
