ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ మేరకు బెంగళూరులోని 48వ ఏసీజేఎం కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
4 రాష్ట్రాల్లో ప్రకాశ్రాజ్ కు ఓటు
ఈ వ్యవహారం 2019లో ప్రారంభమైంది. బెంగళూరుకు చెందిన న్యాయవాది దిలీప్కుమార్ ప్రకాశ్రాజ్పై హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రకాశ్రాజ్కు ఓటు హక్కు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకే ప్రాంతంలో ఓటు హక్కు ఉండాలనే నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ న్యాయవాది దిలీప్కుమార్ తరువాత బీబీఎంపీ అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి కూడా స్పందన రాకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు న్యాయపరమైన విచారణకు వచ్చింది.
విచారణకు రాకపోవడంతో నాన్బెయిలబుల్ వారెంట్
కోర్టు విచారణలో భాగంగా ప్రకాశ్రాజ్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన వరుసగా విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. చివరకు ఆయనపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, ప్రకాశ్రాజ్ తరఫు నుంచి ఈ అంశంపై ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన తదుపరి తీసుకునే నిర్ణయం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.