Homeక్రైమ్Parking Row Turns Deadly: బైక్ పార్కింగ్ గొడవ.. మహిళ ప్రాణం తీసింది!

Parking Row Turns Deadly: బైక్ పార్కింగ్ గొడవ.. మహిళ ప్రాణం తీసింది!

దేశ రాజధాని న్యూఢిల్లీలో చిన్న పార్కింగ్ వివాదం  పెద్ద దారుణానికి దారితీసింది. స్కూటర్ ఎక్కడ పార్క్ చేయాలనే విషయంలో పొరుగువారితో జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణాలను బలితీసుకోగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ ఘటన నైరుతి ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పార్కింగ్ విషయంలో పక్కింటి వారితో గొడవ

ఆర్తి, విక్కీ అనే దంపతులు బిందాపూర్‌లో నివసిస్తున్నారు. వారికి ఉన్న టూ వీలర్ ను రోడ్డుపై పార్క్ చేయడంపై కొంతకాలంగా పొరుగింటి వారితో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను ఎన్నిసార్లు చర్చించినా పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మొదట మాటల తగాదాగా ప్రారంభమైన ఈ వివాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన ప్రత్యర్థులు దంపతులపై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

హాస్పిటల్ కు వెళ్లేలోగా ఆర్తి మృతి

దాడిలో ఆర్తి, విక్కీ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆర్తి శరీరంలోని పలు భాగాల్లో కత్తిపోట్లు ఉండగా, విక్కీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆర్తి అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. దీంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. మరోవైపు, విక్కీ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పప్పు అనే వ్యక్తితో పాటు మరో మైనర్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పప్పును పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మైనర్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న వివాదాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు