-
విశిష్ట అతిథిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
-
యూనివర్సిటీలకు దిక్సూచి ఆంధ్రా యూనివర్సిటీ చంద్రబాబు
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, విశిష్ట అతిథిగా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి వచ్చిన అనేకమంది విభిన్న రంగాల్లో రాణించిన విషయాన్ని ప్రస్తావించారు. తాను సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. రెండు గదులు ఉన్న ఇంట్లోనే సర్దుకునే వారమని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు సచిన్ టెండూల్కర్. తన తండ్రికి చదవంటే చాలా ఇష్టమని.. ఆయన సైతం ప్రొఫెసర్ అని చెప్పుకొచ్చారు.
చిన్ననాటి సంగతుల ప్రస్తావన..
సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి విషయాలను ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చానని.. తన తండ్రి ప్రొఫెసర్ అని.. ఆయనకు చదువు అంటే చాలా ఇష్టమని… రెండు గదుల ఇంటిలోనే సర్దుకునే వారమని.. తాను క్రికెట్ లో నిలదొక్కుకున్న తర్వాత మాత్రమే కారు కొనుక్కున్న విషయాన్ని ప్రస్తావించారు. కారు సౌండ్ మ్యూజిక్ లో సైతం తన తండ్రి పుస్తకాలు చదివే వారు అని.. అస్సలు సౌండ్ తగ్గించమని కోరేవారు కాదని.. అంతలా చదువు పట్ల ఆయనకు ఏకాగ్రత ఉండేదని గుర్తు చేశారు. క్రికెట్ రంగంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురయ్యాయని.. కఠోర సాధన చేసి తాను రాణించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశ్వ నగరంగా విశాఖ..
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు విశాఖ వచ్చినట్లు తెలిపారు. కానీ గూగుల్ కంటే ముందుగానే ఏయు ప్రపంచాన్ని విశాఖ తో కనెక్ట్ చేసిందని.. 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి ఆంధ్ర యూనివర్సిటీ గర్వకారణం అని చెప్పారు. విశాఖ విశ్వ నగరం, గ్లోబల్ సిటీ అని.. ఇది అన్ స్టాపబుల్ అని.. ఎవరు ఆపలేరని చంద్రబాబు తెలిపారు. యూనివర్సిటీలకు ఏయు ఒక దిక్సూచి అని చెప్పుకొచ్చారు. ఎంతోమంది రాజకీయ ఉద్దండులను జాతికి అందించిన గొప్ప విద్యాసంస్థ అని చెప్పుకొచ్చారు. రాబోయే వందేళ్లలో ఏయు మరో చరిత్ర సృష్టిస్తుందని.. బెస్ట్ బ్రాండ్ క్రియేట్ చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.ఏయూ శతాబ్ద వేడుకలు అంబరాన్ని తాకాయి. ఏపీతోపాటు ఒడిస్సా గవర్నర్లు అబ్దుల్ నజీర్, కంభంపాటి హరిబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.