క్రైమ్ మిర్రర్ : తన ఫోన్ నుంచి బదిలీ అయిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ గొర్ల కాపరిని హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో వెలుగుచూసింది. ఈ కేసులో మైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఏఎస్పీ పత్తిపాక సాయి కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కుంటాల మండలం దౌనేల్లి గ్రామానికి చెందిన మహేందర్ (27), లక్ష్మణ్ (16) గొర్ల కాపరులుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా మహేందర్ ఫోన్ను ఉపయోగించి లక్ష్మణ్ తన బ్యాంకు ఖాతాలోకి రూ.90 వేలకుపైగా నగదు బదిలీ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
డబ్బులు తన ఖాతా నుంచి బదిలీ అయిన విషయం తెలుసుకున్న మహేందర్, వాటిని తిరిగి ఇవ్వాలని లక్ష్మణ్ను పలుమార్లు కోరాడు. డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో భయపడిన లక్ష్మణ్, ఏప్రిల్ 18న దౌనేల్లి గ్రామ శివారులోని ఓ బావి వద్దకు మహేందర్ను తీసుకెళ్లి అందులోకి తోసివేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఏప్రిల్ 23న బావిలో మహేందర్ మృతదేహం లభ్యమైంది. తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కుటుంబ సభ్యులు భావించారు.
అయితే బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించిన మృతుడి తల్లికి అనుమానం రావడంతో జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహేందర్ ఖాతా నుంచి లక్ష్మణ్ ఖాతాలోకి భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. అనంతరం విచారణలో లక్ష్మణ్ నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు మైనర్పై కేసు నమోదు చేసి, అతడిని జువెనైల్ న్యాయ ప్రక్రియ ప్రకారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
also read :అనంతపురంలో షాకింగ్ ఘటన.. ఆస్పత్రి రెండో అంతస్తు పై నుంచి మనవరాలిని విసిరేసిన నానమ్మ!
