క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్లోని మియాపూర్ వైశాలీనగర్ రైల్వే అండర్పాస్ సమీపంలో తెరిచి ఉన్న మ్యాన్హోల్లో ప్రమాదవశాత్తు పడి ఓ వృద్ధుడు గల్లంతైన ఘటన ఆందోళన కలిగించింది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేట్ ప్రేమ్నగర్కు చెందిన బాలయ్య (70)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాలయ్య మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో వర్షం కురుస్తుండటంతో వైశాలీనగర్ రైల్వే అండర్పాస్ వద్ద నిలబడి ఉండగా ప్రమాదవశాత్తు జారి తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడిపోయి వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే రాత్రి వేళ కావడం, భారీ వర్షాల కారణంగా నాలాలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గల్లంతైన వృద్ధుడి ఆచూకీ లభించలేదు. ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఘటన స్థలాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. గాలింపు చర్యలను వేగవంతం చేసి, వృద్ధుడి ఆచూకీ కోసం అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
also read : ప్రేమ వ్యవహారంలో విభేదాలు.. యువతి సూసైడ్
