ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రోగుల ఆరోగ్య వివరాలు, వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో భద్రపరచేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఆభా)ను రూపొందించారు. ప్రస్తుతం ఈ విధానం ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగుల వివరాల నమోదు కోసం ఉపయోగంలో ఉంది. అయితే ఇకపై ఈ సేవలను ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్న రోగుల వైద్య చరిత్రను ఇకపై ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా నమోదు చేయనున్నారు. దీనివల్ల ప్రతి రోగికి సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం ఒకే డిజిటల్ వ్యవస్థలో అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త విధానం ద్వారా రోగి ఎక్కడ చికిత్స పొందినా అతని పూర్తి వైద్య చరిత్రను డాక్టర్లు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చికిత్స మరింత వేగంగా, సమర్థవంతంగా అందించవచ్చని వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి జిల్లాలో విజయవంతంగా అమలైన తర్వాత మిగతా జిల్లాలకు విస్తరించనున్నారు. ఇప్పటికే కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రోగుల వివరాల నమోదు విధానం అమలులో ఉండగా, ఇప్పుడు తెలంగాణ కూడా అదే దిశగా ముందుకు సాగుతోంది.
ఈ విధానం ద్వారా ప్రతి రోగి యొక్క బ్లడ్ గ్రూప్, గతంలో చేసిన ఆపరేషన్లు, వైద్య పరీక్షల వివరాలు, చికిత్స చరిత్ర వంటి అన్ని సమాచారం డిజిటల్గా ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లినప్పుడు పాత వైద్య సమాచారం వెంటనే తెలుసుకునే అవకాశం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
అభా అకౌంట్ నమోదు చేస్తే ఒక్కో రోగికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.20 చెల్లించే విధానం కూడా అమలులో ఉంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ వ్యవస్థ అమలు అయితే దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల డిజిటల్ సమీకరణ మరింత బలపడనుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజలు కూడా తమ ఆరోగ్య ఖాతాను సులభంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అభా యాప్లో ఆధార్ నెంబర్ నమోదు చేసి అవసరమైన వివరాలు అందిస్తే ఆరోగ్య ఖాతా సృష్టించబడుతుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తి వైద్య సమాచారం ఒకే డిజిటల్ వ్యవస్థలో భద్రంగా నిల్వ ఉండనుంది.
ALSO READ: మీకు సొంతిల్లు లేదా?.. కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు