క్రైమ్ మిర్రర్ : మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకున్న ఓ ఘటన ‘దృశ్యం’ సినిమా సన్నివేశాలను తలపించింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక వేసిందని పోలీసులు తెలిపారు. ముందుగా అతడి జ్యూస్లో నిద్రమాత్రలు కలిపి స్పృహ కోల్పోయేలా చేసి.. ఆ తర్వాత బ్యాట్తో దాడి చేసి.. చివరకు ఇంట్లోనే నిర్మించిన గుంతలాంటి నిర్మాణంలో పాతిపెట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే కూలీల అనుమానంతో ఈ ప్లాన్ బెడిసికొట్టి భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు, బాధితుడి వాంగ్మూలం ప్రకారం.. 38 ఏళ్ల షర్మిల తన భర్త ప్రవీణ్ జగ్తాప్ను హత్య చేసేందుకు ఈ కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూలై 30న ప్రవీణ్ తాగిన జ్యూస్లో నిద్రమాత్రలు కలిపినట్లు తెలుస్తోంది. దీంతో అతడు దాదాపు రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆగస్టు 1న ప్రవీణ్ కొంత స్పృహలోకి వచ్చినట్లు గుర్తించిన షర్మిల.. అతడిపై బ్యాట్తో దాడి చేసింది. తీవ్రంగా కొట్టడంతో ప్రవీణ్ మళ్లీ స్పృహ కోల్పోయాడు.
ఇంట్లోనే ‘సమాధి’ నిర్మాణం
భర్త చనిపోయాడని భావించిందో లేదా అతడిని పూర్తిగా స్పృహ తప్పించే ప్రయత్నంలో భాగంగానో.. షర్మిల కూలీలతో ఇంటి బాల్కనీలో ఇటుకలు, సిమెంట్తో గుంతను పోలిన నిర్మాణం చేయించింది. అనంతరం స్పృహలో లేని ప్రవీణ్ను అందులో పడేసి, పైన స్లాబ్ రాయిని ఉంచి మూసివేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే నిర్మాణం విషయంలో కూలీలకు అనుమానం వచ్చింది. గుంతలో ఉన్న వ్యక్తి కదులుతున్నట్లు గుర్తించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రవీణ్ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి షర్మిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
‘నన్ను బ్యాట్తో కొట్టింది’
బాధితుడు ప్రవీణ్ తనకు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. తనకు నిద్రమాత్రలు ఇవ్వడంతో రెండు రోజుల పాటు నిద్రలో ఉన్నానని, మూడో రోజు కొంత స్పృహ వచ్చిన సమయంలో భార్య తనను బ్యాట్తో కొట్టిందని చెప్పాడు. అనంతరం బాల్కనీలోని గుంతలో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో ఉన్న తన తల్లికి కూడా నిద్రమాత్రలు ఇచ్చినట్లు ప్రవీణ్ వివరించాడు. అయితే భార్య తనను బ్యాట్తో కొడుతున్నప్పుడు తన తల్లికి స్పృహ రావడంతో ఇది చూసి తన తమ్ముడికి సమాచారం ఇచ్చిందని చెప్పాడు. తన తమ్ముడు వెంటనే ఇంటికి చేరుకున్నాడని, గుంతలో ఉన్న తనను చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ప్రవీణ్ వివరించాడు.
చేతబడిపై భర్త అనుమానం
తనపై హత్యాయత్నం వెనుక చేతబడి లేదా క్షుద్రపూజలకు సంబంధించిన కారణం ఉండొచ్చని ప్రవీణ్ అనుమానం వ్యక్తం చేశారు. అమావాస్య రోజులకు సంబంధించిన తేదీల్లో తన భార్య క్యాలెండర్పై కొన్ని రాతలు రాసిందని అతడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్ధారణ కాలేదు. మరోవైపు తన ఇద్దరు పిల్లల భద్రతపై కూడా ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వారు అత్తమామల వద్ద ఉన్నారని, వారి భద్రతపై పోలీసులు దృష్టి పెట్టాలని కోరారు.
also read : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో విషాదం.. లిఫ్ట్లో చిక్కుకుని ఇద్దరు మృతి
