మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి ఖైదీ పరారైన ఘటన తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన జైలు సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతో పాటు సంబంధిత సిబ్బందిపై కూడా చర్యలు తీసుకున్నారు.
అధికారుల ఆదేశాల మేరకు జరిగిన సమగ్ర విచారణలో జైలు నిర్వహణలో లోపాలు, భద్రతా లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కారణంగానే ఖైదీ పారిపోవడం జరిగినట్లు నివేదికలో వెల్లడైంది. దీంతో ఆయన్ను చంచల్గూడ కేంద్ర కారాగారానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ ఘటనలో ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేయగా, మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు.
వనపర్తి జిల్లా అమరచింత మండలానికి చెందిన కిశోర్ కుమార్ రెడ్డి అనే యువకుడు మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో అతడిని జూన్ 12న మహబూబ్నగర్ జైలుకు తరలించారు.
అయితే జూలై 6న రాత్రి సమయంలో జైలు గోడ దూకి కిశోర్ పరారయ్యాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
also read: ఫిన్లాండ్లో అదృశ్యమైన తెలుగు విద్యార్థి మృతి? అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు!