Crime Mirror, Telangana State News: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల గూడలో దారుణం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా సామూహిక హత్యలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై పోక్సో నమోదు చేశారని కక్షతో ఒక వ్యక్తి మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన భయాందోళన రేకెత్తించింది.
మృతి చెందిన వారిలో హత్యకు పాల్పడిన వ్యక్తి పై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం..
గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన ఒక బాలిక (17) ఈ ఏడాది మే 16న బాధిత తల్లి తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు అతని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్టు చేశారు. అనంతరం అతడు శుక్రవారం బెయిల్ పై గ్రామానికి విడుదలై వచ్చాడు.
జైలుకు వెళ్ళినప్పటి నుంచి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న అతడు బయటికి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున తన ఇంటికి వెళ్లి భార్య సరిత (30), మూడేళ్ల కుమార్తె పరీక్షిత్, రెండేళ్ల కుమారుడు రుద్రవాన్సులను కత్తితో పొడిచే అత్యంత దారుణంగా హత్య చేశాడు.
అక్కడి తో ఆగకుండా తనపై ఫిర్యాదు చేసిన బాలిక ఇంటికి వెళ్ళాడు. ఇంటిలో ఆ సమయంలో ఉన్న బాధితురాలు తల్లి చిట్యాల లక్ష్మి, బాలిక నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65) లను అదే కత్తితో కిరాతకంగా హతమార్చాడు. ఆ తరువాత బాధిత బాలికను ఎత్తుకెళ్లి ఊరు శివారులో అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. హత్యల అనంతరం రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.
ఈ విషయాన్ని వెంటనే రాజ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయడంతో షాబాద్ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఒకేసారి హత్యలు జరగడంతో గ్రామంలో ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమికంగా విచారణ జరిపి పోక్సో కేసు పెట్టిన కారణంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని చెబుతున్నారు.
బాలికను రాజశేఖర్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలు రికార్డు అయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడకుండా పరారీ కావడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డిసిపి యోగేష్ గౌతమ్ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన ఘటనగా దీనిని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు పట్ల కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ గ్రామస్తులు నుంచి వినిపిస్తోంది.
ఈ ఘటనకు పాల్పడిన రాజ్ కుమార్ తన కుటుంబాన్ని ఎందుకు హత్య చేశాడు అనే విషయాలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగా అయితే ఫిర్యాదు చేసిన బాలిక కుటుంబం పై దాడితో ఆగాలి. కానీ తొలత తన కుటుంబాన్ని హత్య చేసి ఆ తర్వాత ఫిర్యాదు చేసిన బాలిక కుటుంబం వైపు రావడానికి గల కారణాలను పోలీసులు సునిసితంగా విశ్లేషిస్తున్నారు.