Homeజాతీయంస్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై FSSAI కఠిన చర్యలు.. గడువు ముగిసిన ఆహార సరఫరాపై 9 నోటీసులు

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై FSSAI కఠిన చర్యలు.. గడువు ముగిసిన ఆహార సరఫరాపై 9 నోటీసులు

  • వినియోగదారుల ఫిర్యాదులతో బయటపడ్డ లోపాలు.. వివరణ ఇవ్వాలని ఆదేశాలు

భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ప్రముఖ ఆన్‌లైన్ గ్రోసరీ సేవ అయిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై కఠిన చర్యలు చేపట్టింది. వినియోగదారుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా సంస్థకు ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసింది. వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ప్రకారం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన గుడ్లు, పాడైన పాలు, నాణ్యతలేని రెడీ-టు-ఈట్ ఫుడ్, అలాగే కలుషితమైన శిశు ఆహారం సరఫరా చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు ఉత్పత్తులు దుర్వాసన వస్తున్న స్థితిలోనే డెలివరీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇంకా, ప్యాకేజింగ్ దెబ్బతిన్న ఆహార పదార్థాలు కూడా వినియోగదారులకు చేరినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా వే ప్రోటీన్, ఆర్గానిక్ గుడ్లు, రెడీ ఫుడ్, పాలు వంటి వస్తువుల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఫిర్యాదులపై పూర్తి వివరణ ఇవ్వాలని FSSAI స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ఆదేశించింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరింది.
అదే సమయంలో, నిర్ణీత గడువులోగా సరైన సమాధానం ఇవ్వకపోతే ఆహార భద్రత చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే, ఈ విషయంపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఈ ఘటనతో ఆన్‌లైన్ ఆహార సరఫరా సేవల నాణ్యతపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

also read: కేరళలో విషాదం: చికిత్సకు వెళ్లిన 18 నెలల చిన్నారి మృతి – అనస్థీషియాపై తల్లిదండ్రుల ఆరోపణలు

 

తాజావార్తలు