క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) జాతీయ విద్యా విధానానికి (NEP) అనుగుణంగా ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు చేస్తూ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ మరియు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టింది.
2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. విద్యార్థుల్లో బట్టీ పట్టే విధానాన్ని తగ్గించి, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడమే లక్ష్యంగా బోర్డు ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు సెకండియర్లో మాత్రమే 30 మార్కులకు ఉన్న ప్రాక్టికల్స్ను ఇకపై రెండు సంవత్సరాలకు విభజించారు. ఫస్టియర్ మరియు సెకండియర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు ఫస్టియర్లో 15 మార్కులు, సెకండియర్లో 15 మార్కుల చొప్పున ప్రయోగ పరీక్షలు ఉంటాయి.
వార్షిక రాత పరీక్షలు (Theory) రెండు సంవత్సరాల 60 మార్కులకే జరుగుతాయి. మ్యాథ్స్లో ప్రాక్టికల్స్ సాధ్యం కానందున ‘క్రియాశీల అభ్యాసన విధానం’ (ABL) ప్రవేశపెట్టారు. ఫైనల్ ఎగ్జామ్స్ మార్కులను 75 నుండి 60 మార్కులకు తగ్గించారు. మిగిలిన 15 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ (ABL) కు కేటాయించారు. మ్యాథ్స్-A, మ్యాథ్స్-B రెండింటికీ ఫస్టియర్, సెకండియర్లలో ఈ విధానం వర్తిస్తుంది.
కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ వంటి ఆర్ట్స్ సబ్జెక్టులతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ వంటి భాషా సబ్జెక్టులకు ఇప్పటి వరకు 100 మార్కులకు రాత పరీక్ష ఉండేది. ఇకపై వీటికి 80 మార్కులకు రాతపరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంట్ (ABL) నిర్వహిస్తారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ కలయికతో కొత్తగా ACE గ్రూపును ప్రారంభిస్తున్నారు. MEC గ్రూప్ విద్యార్థులకు ఇప్పటి వరకు MPC వారితో సమానంగా కఠినమైన మ్యాథ్స్ పేపర్ ఇచ్చేవారు. ఇకపై వీరికి ప్రత్యేక సులువైన ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఎన్సీఈఆర్టీ (NCERT) ప్రమాణాలకు అనుగుణంగా QR కోడ్లు, రేఖాచిత్రాలతో కూడిన నూతన సిలబస్ పుస్తకాలను జూన్ 1 నాటికి అందుబాటులోకి తెస్తారు.
ఈ సంస్కరణల ద్వారా విద్యార్థులు ప్రయోగశాలల (Labs) పై మొదటి సంవత్సరం నుంచే పట్టు సాధించడమే కాకుండా, JEE మరియు NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు మెరుగ్గా సిద్ధపడటానికి సహాయపడుతుందని ఇంటర్ బోర్డు వెల్లడించింది.