హైదరాబాద్, క్రైమ్మిర్రర్: నేపాలి గ్యాంగ్లు వరుస దొంగతనాలతో నగరవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్య కేసు దర్యాప్తులో ఉండగానే నేపాలి గ్యాంగ్ మరోభారీ దోపిడికి పాల్పడిన ఘటనజవహర్నగర్లోని కౌకుర్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో చోటు చేసుకుంది. 60 తులాల బంగారం, వెండితోపాటు రూ.30 వేల నగదును ఈ గ్యాంగ్ దోచుకుపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ దంపతులు మత్తు నుంచి తేరుకుని గట్టిగా కిటికీలో నుంచి అరవడంతో.. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ ఇంటి తలుపులు తీశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేపాల్కు చెందిన ఒక జంట 13 రోజుల క్రితమే తమ ఇంట్లో పని మనుషులుగా చేరారని ఈ దంపతులు పోలీసులకు వివరించారు. ఇటీవలే మరో మహిళ వచ్చి వారి బంధువుగా పరిచయమై తమ ఇంట్లో ఉంటోందని తెలిపారు. సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలు చేసుకుంటామంటే.. అందుకు అంగీకరించామని ఆ దంపతులు చెప్పారు. ఈ వేడుకలకు మరో ముగ్గురు వ్యక్తులు బయట నుంచి వచ్చారని పేర్కొన్నారు.
ఈ వేడుకల అనంతరం భోజనం చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చి తమపై ఈ నేపాలీ గ్యాంగ్ దాడి చేసిందని పోలీసులకు ఆ దంపతులు తెలిపారు. కాళ్లు, చేతులు కట్టేసి తమను బెదిరించడంతో.. మమ్మల్ని చంపకండి.. మీకు కావాల్సింది తీసుకెళ్లమని వారిని కోరినట్లు వారు చెప్పారు. దీంతో ఇంట్లో నగలతోపాటు విలువైన వస్తువులను ఈ గ్యాంగ్ దోచుకుపోయిందన్నారు. అనంతరం ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసి.. అన్ని గేట్లకు తాళాలు వేసి వారు పరారయ్యారని వివరించారు.
ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారని చెప్పారు. ఆ ఇంటిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పరిశీలించారు. దోపిడీ జరిగిన కాలనీలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను నేపాలీ గ్యాంగ్ దారుణంగా హత్య చేసి.. ఇంట్లోని నగలతో పరారైన సంగతి తెలిసిందే. ఈ ముఠా కోసం గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ నేపాలీ ముఠా కూడా ఐపీఎస్ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరిన విషయం విదితమే.