-
మూడోసారి ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు…
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. మరోసారి గురువారం విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైసిపి హయాంలో దాదాపు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి మద్యం కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే దర్యాప్తు అధికారులు పావులు కదిపారు. అయితే ఈ కేసులో ఆయనపై చర్యలు ఉండవని అంతా భావించారు.
కానీ ఇప్పుడు ఉన్నఫలంగా ఆయన విచారణకు హాజరు కావడం సంచలనంగా మారింది. ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు అర్థమవుతోంది. దర్యాప్తులో భాగంగా మనీ లాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేస్తోంది ఈడి. విజయసాయిరెడ్డి ఈడి ఎదుట హాజరు కావడం విశేషం. ఇప్పటివరకు ఆయన ఈడి అధికారుల ఎదుటకు రావడం ఇది మూడోసారి. హైదరాబాదులోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో సాయి రెడ్డి విచారణకు హాజరుకాగా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
భారీ కుంభకోణం…
వైసిపి హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగింది. ఏకంగా మద్యం విధానాన్ని నిబంధనలకు విరుద్ధంగా మార్చేశారు. కొన్ని నిర్దిష్టలరీలకే లాభం చేకూరేలా చేశారు. మద్యం కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెలలోనే ఈడీ అధికారులు హైదరాబాద్, తిరుపతిలోని విజయసాయిరెడ్డి నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయన అనుచరుల ఎల్లప్ప ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలతో పాటు డిజిటల్ డివైస్ లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల డైరీలు, బ్యాంక్ స్టేట్మెంట్లో ఆధారంగా ఈడి రాజాగా సమన్లు జారీ చేసి ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అప్రూవర్ గా…?
గతంలో మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరాలతోనే దర్యాప్తు ముందుకు సాగినట్లు ప్రచారం నడిచింది. ఇప్పుడు ఈడి కూడా మద్యం కుంభకోణం ద్వారా సమకూరిన నిధులతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోకి ఎలా మళ్ళించారనే దానిపై విజయసాయిరెడ్డిని గట్టిగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో విచారణకు హాజరైన క్రమంలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మద్యం కుంభకోణంతో ఎటువంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. ప్రధాన సూత్రధారు రాజ్ కసిరెడ్డి అని.. కేవలం తాను మధ్యవర్తిత్వం మాత్రమే వహించాను అంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు.
అయితే ఒక్కటి మాత్రం నిజం. మద్యం కుంభకోణం కేసు విచారణ తీవ్రతరం అయిన తరుణంలోనే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాను అప్రూవర్ గా మారే ప్రసక్తి లేదని పదే పదే ప్రకటించడం ద్వారా ఆయన పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు మూడోసారి విచారణకు పిలవడంతో ఆయన ద్వారా సంచలన వివరాలు నమోదు అయ్యే అవకాశం ఉంది.