హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: వేసవి రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం చాలా సాధారణం. దీంతో అలసట, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ కాలంలో సరిపడా నీరు తాగటంతో పాటు నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
కర్బూజ…
వేసవిలో కర్బూజ మంచి ఎంపికగా చెప్పొచ్చు. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి చల్లదనం అందుతుంది. తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడటానికి, మలబద్ధకం తగ్గించటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కర్బూజ మంచి పాత్ర పోషిస్తుంది….
మామిడి రుచి...
వేసవికాలం అంటే మామిడి పండ్ల సీజన్. రుచితో పాటు ఇందులో శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. మామిడి తరచూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తిని అందించడమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
పుచ్చకాయ…
వేసవిలో ఎక్కువ మంది ముందుగా ఎంచుకునే పండు పుచ్చకాయ. దీనిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరం హైడ్రేట్గా ఉంటుంది. వడదెబ్బ నుంచి రక్షించడంతో పాటు మూత్రంలో మంట తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా పుచ్చకాయ మేలు చేస్తుంది.
ఇంకా ఇవి కూడా మంచివే…
నారింజ, ద్రాక్ష, అరటి, కీవీ, తాటి ముంజలు వంటి పండ్లను కూడా తరచూ తీసుకోవడం మంచిదే. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. వేసవి ప్రభావాన్ని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఇవి బాగా సహాయపడతాయి