•తెలుగు రాష్ట్రాలకు జూన్ రెండో వారంలోనే
•వాతావరణ శాఖ నుంచి స్పష్టత
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో రుతుపవనాల కదలికపై కీలక అప్డేట్ వచ్చింది. ఈసారి రుతుపవనాలు ముందుగానే అండమాన్ కు చేరుకున్నాయి. దీంతో ఈనెల 26 నాటికి కేరళలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. దీంతో అందరూ ఉపశమనం పొందారు. కానీ తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది.
మరింత ఆలస్యం..
సాధారణంగా మే చివరిలో రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. కానీ ఈసారి జూన్ మొదటి వారంలో తాకనున్నాయి అనేది వాతావరణ శాఖ తాజా అప్డేట్. వడగాల్పుల ప్రభావం పెరిగితే ఇది మరింత ఆలస్యం కావచ్చు అనేది అంచనాగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాలకు జూన్ రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి.
ద్రోణిల ప్రభావంతో..
ప్రస్తుతం రుతుపవనాలు అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. ఇదే సమయంలో ఉపరితల ద్రోణీ ఒకటి ఏర్పడింది. దాని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర ఆంధ్ర వరకు ఒడిస్సామీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉంది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది వ్యాపించి ఉంది. ఉత్తర తమిళనాడు తీరం మరియు పరిసర ప్రాంతాలపై సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో సైతం ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు జూన్ రెండో వారంలోనే నైరుతీ రుతుపవనాలు తాకే ఛాన్స్ కనిపిస్తోంది.