క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ సమీపంలోని హల్దీ వాగులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన యెర్రగొల్ల ప్రశాంత్ (27), వికాస్ (26), మరియు కె. ఆనంద్ రెడ్డి (27) వీరు బుధవారం తూప్రాన్లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై, గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో నాచారంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు.
దర్శనం తర్వాత సరదాగా స్నానం చేసేందుకు ఈత కొట్టేందుకు హల్దీ వాగులోకి దిగారు. నీటి లోతును అంచనా వేయలేకపోవడం మరియు ఈత రాకపోవడంతో ముగ్గురూ వాగులో మునిగి మరణించారు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వేడుకకు వచ్చి ఇలా అకాల మరణం చెందడం ఆ కుటుంబాల్లోను, నర్సాపూర్ ప్రాంతంలోను తీవ్ర విషాదాన్ని నింపింది.