క్రైమ్ మిర్రర్ : నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేరళకు చెందిన రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్దాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్కు చెందిన ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం కొచ్చిలోని మట్టాంచేరిలో ఉన్న ఆయన నివాసానికి చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుంది.
ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై మోహన్దాస్ చేసిన ఓ యూట్యూబ్ వీడియోలోని వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. ‘నిరసనలో పాల్గొనే అమ్మాయిలకు అత్యాచారాలంటే ఇష్టం. అత్యాచారానికి గురవ్వడాన్ని ఆస్వాదించే అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు’ అని ఆయన తన యూట్యూబ్ వీడియోలో అన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆందోళనల్లో పాల్గొనే మహిళలపై లైంగిక దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా.. తాను అధికారంలో ఉంటే నిరసనలను అణచివేసేందుకు కర్ఫ్యూ విధిస్తానని, ఆదేశాలను పాటించని ఆందోళనకారులపై కాల్పులు జరుపుతానని ఆయన వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయినా, మరికొందరు శాశ్వతంగా గాయపడినా పరిస్థితిని త్వరగా అదుపులోకి తీసుకొస్తామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మోహన్దాస్ ఉపయోగించిన యూట్యూబ్ ఖాతాతో పాటు వివాదాస్పద వీడియోను రూపొందించేందుకు, ప్రసారం చేసేందుకు ఉపయోగించిన డిజిటల్ పరికరాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేసులో తదుపరి చర్యలు దర్యాప్తు ఆధారంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
also read : జగిత్యాల బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం.. మనుమడు మృతి, తాత పరిస్థితి విషమం
