క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలోని పెంచి మండలం పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 10 ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా బూడిద కావడంతో బాధిత రైతు కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఏడాది పాటు కష్టపడి పండించిన పంట ఇలా నాశనం కావడంతో వారికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నష్టపోయిన రైతుల వివరాలను తక్షణమే సేకరించి, వారికి ఆర్థిక సహాయం అందించాలని సి.ఎం.ఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం.
బాధిత రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయాలని, రైతులకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.