క్రైమ్ మిర్రర్ : భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర శనివారం తిరిగి ప్రారంభమైంది. వాతావరణం కొంత అనుకూలంగా మారడంతో బల్తాల్ మార్గం నుంచి భక్తులను పవిత్ర గుహ దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెలలో ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడం వంటి కారణాలతో భద్రతా దృష్ట్యా శుక్రవారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో బల్తాల్ మార్గంలో యాత్రను పునఃప్రారంభించారు. మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు పనులు కూడా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు పహల్గాం మార్గంలో మాత్రం యాత్రను ఇంకా నిలిపివేశారు. ఈ మార్గంలో వాతావరణం పూర్తిగా అనుకూలంగా లేకపోవడం, రహదారి మరమ్మతు పనులు కొనసాగుతుండటంతో భక్తులకు అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. సుమారు 250 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి జమ్మూను కాశ్మీర్ లోయతో అనుసంధానించే కీలక మార్గం. రోడ్డు పరిస్థితుల కారణంగా భాగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరాల్సిన భక్తుల రాకపోకలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గత నెల 3వ తేదీన ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో ఇప్పటివరకు సుమారు 4.5 లక్షల మంది భక్తులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది యాత్ర ఈ నెల చివరి వరకు కొనసాగనుంది.
also read : అద్దె ఇల్లు ఖాళీ చేయించేందుకు వెళ్లిన యజమానిపై కాల్పులు.. న్యాయవాది అరెస్ట్
