క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని స్మరించుకుంటూ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు అపారమైన బలాన్నిచ్చాయని కొనియాడారు. ‘లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం’ అని వ్యాఖ్యానించారు. ‘నాడు మిడ్జిల్లో రేవంత్రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో రేవంతన్నగా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా.. అన్నింటికీ మించి రేవంతన్నగా… మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.