హనీమూన్ సమయంలో భార్యకు పీరియడ్స్ రావడంతో భర్త దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో కలకలం రేపుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. గోరఖ్పూర్కు చెందిన ఓ దంపతులు ఇటీవల హనీమూన్ కోసం అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లారు. అక్కడ భార్యకు నెలసరి రావడంతో భర్త తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు బాధితురాలు ఆరోపించింది. హనీమూన్ సమయంలో తనకు పీరియడ్స్ రావడంతో భర్త గొడవకు దిగాడని, తనను తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
భర్త దాడి నుంచి తప్పించుకునేందుకు తాను కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షించినట్లు తెలిపింది. అనంతరం దంపతులు స్వస్థలానికి తిరిగి వచ్చినప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితురాలు ఆరోపించింది. అదనపు కట్నం కోసం అత్తింటివారు తనను వేధించారని, చివరకు ఇంటి నుంచి బయటకు పంపించారని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు భర్త నిఖిల్ మిశ్రాతో పాటు అతని తల్లి, సోదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: పెళ్లైన వారం రోజుల్లోనే నవ వధువు పరార్.. అత్తింట్లో నగలు, నగదు మాయం!
