శ్రావణ మాసం సందర్భంగా బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అశోక్ ధామ్ ఆలయంలో జలాభిషేకం చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా.. అనూహ్యంగా జరిగిన పరిణామం తొక్కిసలాటకు దారితీసింది.
ఆలయం వద్ద భక్తుల క్యూలైన్కు సమీపంలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. దీంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయంటూ ప్రచారం జరగడంతో భక్తుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ తెలిపారు.
ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 12 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బీహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.
భారీగా భక్తులు తరలివచ్చిన సమయంలో భద్రతా ఏర్పాట్లు, పరిస్థితులపై అధికారులు సమీక్షిస్తున్నారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.
also read: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీకి గుండెపోటు.. యాంజియోప్లాస్టీ
