- అప్రమత్తంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులకు ఎస్పీ రివార్డు
సంగారెడ్డి, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా కల్హేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్-100కు వచ్చిన అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించిన పోలీసులు ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. శుక్రవారం రాత్రి ఓ మహిళ తన భర్త ఇంట్లో తలుపు వేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు డయల్-100కు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న నైట్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుల్ తుకారాం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, లోపల నుంచి తలుపు వేసుకుని ఉన్న వ్యక్తిని సకాలంలో రక్షించారు.

అనంతరం అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుల్ తుకారాంను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అభినందిస్తూ నగదు రివార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు నిర్భయంగా డయల్-100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల రక్షణ, భద్రత కోసం జిల్లా పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా సేవలందిస్తున్నారని తెలిపారు.