Rain Alert: ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ట్రోపో ఆవరణంలో వీస్తున్న గాలులు, అలాగే విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా, మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. వ్యవసాయ పనుల సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించాలని తెలిపారు.
ఆదివారం రాష్ట్రంలోని మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉందని హెచ్చరించారు. అల్లూరి జిల్లా అనంతగిరి, పోలవరం జిల్లా గుర్తేడు, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని తెలిపారు. అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, చీడికాడ, చోడవరం, దేవరపల్లి, మాడుగుల, పరవాడ మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలోని తోవిలో అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. పోలవరం జిల్లాలోని యేర్రంపేటలో 40.5°C, నంద్యాల జిల్లా సంజామలలో 40.4°C, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం, కడపలో 40.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 40.2°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 40.1°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పెరుగుతున్న ఎండల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: Sanjeev Arora Arrest: రూ.150 కోట్ల స్కామ్.. పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్!