నల్లగొండ మున్సిపల్ ఎన్నికలు...హైటెక్ నిఘా.. భద్రతా వలయం
నామినేషన్ కేంద్రాల వద్ద ‘ఐరన్ ఫోర్ట్’ బందోబస్తు
–ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన, నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధమైంది. బుధవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నల్లగొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన, నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని స్వయంగా తనిఖీ చేశారు.
భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఎన్నికల కోడ్ అమలుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ కేంద్రం లోపల, బయట ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. తోపులాటలు జరగకుండా బారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, కేంద్రం చుట్టుపక్కల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు,
100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రాల వద్ద కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ‘ఐరన్ ఫోర్ట్’ బందోబస్తు ను పరిశీలిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో అభ్యర్థితో పాటు, పరిమిత సంఖ్యలో మాత్రమే వ్యక్తులకు అనుమతి ఉంటుందని, అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, జెండాలు, బ్యానర్లు ప్రదర్శించడం పూర్తిగా నిషిద్ధమన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు. ప్రతి అభ్యర్థి, రాజకీయ పార్టీ ప్రతినిధి ఎన్నికల నియమాలను గౌరవించాలన్నారు. శాంతియుత వాతావరణంలో, పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసేలా, పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందన్నారు.
హైటెక్ నిఘా.. భద్రతా వలయం:
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. పరిసరాలను 24/7 సిసి కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయడానికి, ప్రత్యేక గస్తీ బృందాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లను అందుబాటులో ఉంచారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే అదుపులోకి తీసుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బి సీఐ రాము, టూ టౌన్ ఎస్ఐ సైదులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు.
జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు.
తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.