‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత హీరోయిన్ నభా నటేష్ వరుస అవకాశాలు అందుకుంటారని అందరూ భావించారు. అయితే మధ్యలో జరిగిన ప్రమాదం కారణంగా ఆమె కెరీర్కు కొంతకాలం బ్రేక్ పడింది. భుజానికి గాయం కావడంతో దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు నభా తెలిపారు.
రీ ఎంట్రీలో ఆమె రెండు భారీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. వాటిలో ఒకటి ‘నాగబంధం’, మరొకటి ‘స్వయంభూ’. ఈ రెండు సినిమాలు తనకు నటిగా మంచి సంతృప్తిని ఇచ్చాయని ఆమె చెప్పారు. జూలై 3న విడుదల కానున్న ‘నాగబంధం’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన నభా, తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సినిమాలో తాను ‘పార్వతి’ అనే పాత్రలో కనిపిస్తానని చెప్పారు. వేదాలు అభ్యసించే విద్యార్థినిగా తన పాత్ర ఉంటుందని, భావోద్వేగాలకు పెద్దపీట వేసే పాత్ర ఇదని తెలిపారు. కుటుంబం, ప్రేమ కోసం ఎంతదూరమైనా వెళ్లే బలమైన వ్యక్తిత్వంతో ఆ పాత్ర సాగుతుందని అన్నారు. కథలో తన పాత్ర తీసుకునే నిర్ణయాలే కీలక మలుపులు తీసుకొస్తాయని, ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారని చెప్పారు.
సినిమా కోసం రూపొందించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ చాలా అద్భుతంగా ఉందని నభా పేర్కొన్నారు. నిజమైన ఆలయంలో ఉన్న అనుభూతి కలిగించేలా ఆ సెట్ను తీర్చిదిద్దారని చెప్పారు. ప్రేక్షకులను కూడా ఆ విజువల్స్ ఆకట్టుకుంటాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
దర్శకుడు అభిషేక్ నామా ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారని నభా తెలిపారు. కథ చెప్పినప్పుడే తాను ఆకట్టుకున్నానని, ప్రతి సన్నివేశాన్ని ముందుగానే స్టోరీబోర్డ్ రూపంలో సిద్ధం చేశారని చెప్పారు. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ నుంచి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా రూపొందించారని వెల్లడించారు. తన పాత్రకు మేకప్, కాస్ట్యూమ్ సిద్ధం కావడానికి రోజూ దాదాపు రెండు గంటలు పట్టేదని చెప్పారు.
ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నభా అన్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘నాగబంధం’, ‘స్వయంభూ’ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ రెండు చిత్రాలు తన కెరీర్లో మరో విజయానికి నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.