HomeజాతీయంKarnataka Politics: సీఎం మార్పుపై ఊహాగానాలు.. సిద్దరామయ్య, డీకేకు ఢిల్లీ పిలుపు!

Karnataka Politics: సీఎం మార్పుపై ఊహాగానాలు.. సిద్దరామయ్య, డీకేకు ఢిల్లీ పిలుపు!

కర్నాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తరఫున కేసీ వేణుగోపాల్ వారిద్దరినీ ఢిల్లీకి రావాలని కోరినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై మరోసారి చర్చ మొదలైంది.

అసలేం జరిగిందంటే?

కేసీ వేణుగోపాల్‌ స్వయంగా సీఎం సిద్దరామయ్యకు ఫోన్‌ చేసి ఢిల్లీకి రావాలని చెప్పారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కూడా పిలుపు వెళ్లింది. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేను కూడా సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఎందుకు ఈ సమావేశం?

ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత ఆరు నెలలుగా కర్ణాటకలో సీఎం మార్పుపై ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇచ్చే అవకాశాలపై తరచూ చర్చ జరుగుతోంది. కానీ, సిద్దరామయ్య మాత్రం పార్టీ అధిష్ఠానం కోరితే ఇంకా రెండేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నానని పలుమార్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో జరిగే సమావేశంలో నాయకత్వ మార్పుపై ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ భేటీలో రాహుల్ గాంధీ పాల్గొనరని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై కూడా చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్‌ మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక సీటు ఖర్గే కుటుంబానికి ఖరారైందని, మరో సీటుకు వైఎస్ శర్మిల పేరు కూడా వినిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు