HomeజాతీయంCrop Loans: రైతులకు సీఎం విజయ్‌ గుడ్‌న్యూస్.. రూ.50 వేల పంట రుణాల మాఫీ!

Crop Loans: రైతులకు సీఎం విజయ్‌ గుడ్‌న్యూస్.. రూ.50 వేల పంట రుణాల మాఫీ!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ రైతులు మరియు సినీ రంగానికి సంబంధించిన రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సహకార బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు ఊరటనిస్తూ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని థియేటర్లలో కొత్త సినిమాల ప్రదర్శనపై కూడా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

రూ. 50 వేల రుణమాఫీ

2025 మే 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్యకాలంలో సహకార బ్యాంకుల ద్వారా రూ.50 వేల వరకు పంట రుణాలు పొందిన రైతుల అప్పులను పూర్తిగా మాఫీ చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చిన్న రైతులకు లాభం చేకూరనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా పెరుగుతున్న సాగు ఖర్చులు, వర్షాల సమస్యలు, దిగుబడి తగ్గుదల వంటి కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిగా భావిస్తున్నారు.

ఇక రూ.50 వేలకుపైగా రుణాలు తీసుకున్న రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక విధానం అమలు చేయనుంది. వారు తీసుకున్న రుణాల మొత్తాన్ని బట్టి స్థాయిల వారీగా కొంతమేర రుణాన్ని మాఫీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

వారం రోజుల పాటు 5 షోల ప్రదర్శనకు అనుమతి

మరోవైపు తమిళనాడు సినిమా రంగానికి కూడా సీఎం విజయ్‌ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో కొత్త సినిమా విడుదలైన రోజు నుంచి వరుసగా 7 రోజుల పాటు ప్రతిరోజూ 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. సాధారణంగా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అదనపు షోలకు అనుమతులు ఇస్తుండగా, ఇప్పుడు కొత్త సినిమాలకు వారం రోజుల పాటు ఈ సౌకర్యం కల్పించడం సినీ పరిశ్రమకు ఊతమివ్వనుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో నిర్మాతలు, థియేటర్ యజమానులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు ప్రారంభ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు