ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక శుభవార్త అందించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఆటో సెటిల్మెంట్ విధానాన్ని విస్తరించేందుకు ఈపీఎఫ్ఓ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ క్లెయిమ్స్కే పరిమితమైన ఈ సౌకర్యాన్ని త్వరలో ఫైనల్ క్లెయిమ్స్కూ అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను మరింత త్వరగా, సులభంగా పొందే అవకాశం కలగనుంది.
ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం రూ.5 లక్షల లోపు అడ్వాన్స్ క్లెయిమ్స్ను ఆటో సెటిల్మెంట్ విధానంలో ప్రాసెస్ చేస్తున్నారు. త్వరలో ఈ విధానాన్ని పూర్తి ఉపసంహరణ క్లెయిమ్స్కు కూడా విస్తరించనున్నారు. దీనివల్ల క్లెయిమ్స్ పరిశీలనలో జరిగే ఆలస్యాలు గణనీయంగా తగ్గడంతో పాటు నిధులు నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోకి వేగంగా జమ కానున్నాయి. కాగితపు ప్రక్రియ తగ్గి పూర్తిగా పేపర్లెస్ విధానంలో సేవలు అందించేందుకు ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం ఉద్యోగులు తరచూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పీఎఫ్ క్లెయిమ్స్ ఆలస్యం ఒకటి. ఉద్యోగం మారినప్పుడు లేదా ఉద్యోగం కోల్పోయిన సమయంలో ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవాలంటే అనేక దశల్లో పరిశీలన జరుగుతోంది. యజమాని ధృవీకరణ, సాంకేతిక సమస్యలు, పత్రాల పరిశీలన వంటి కారణాలతో క్లెయిమ్స్ ప్రాసెసింగ్కు ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటో సెటిల్మెంట్ విధానం అమల్లోకి వస్తే క్లెయిమ్స్ వేగంగా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఇక ఉద్యోగులు తరచూ కంపెనీలు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కొత్త విధానం మరింత ఉపయోగకరంగా మారనుంది. ఉద్యోగ మార్పుల సమయంలో పీఎఫ్ ఖాతాల బదిలీ, ఉపసంహరణ ప్రక్రియ సులభతరం అవుతుందని ఈపీఎఫ్ఓ చెబుతోంది. ఆటోమేటిక్ అకౌంట్ మైగ్రేషన్ దిశగా కూడా సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీని ద్వారా ఉద్యోగులు అనవసరమైన కార్యాలయ చుట్టాలు, కాగితపు ప్రక్రియల నుంచి ఉపశమనం పొందే అవకాశముంది.
డిజిటల్ సేవలను విస్తరిస్తున్న ఈపీఎఫ్ఓ, ఉద్యోగులకు మరింత వేగవంతమైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తోంది. ఆటో సెటిల్మెంట్ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉద్యోగ మార్పులు చేసిన వారు, అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైన చందాదారులకు ఇది భారీ ఊరటనివ్వనుంది.
ALSO READ: ఏపీ ప్రజలకు శుభవార్త.. కొత్తగా మరో ఎక్స్ప్రెస్ హైవే