-
పల్నాడు పడవ విషాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
-
రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా!
క్రైమ్ మిర్రర్, ఏపీ స్టేట్ బ్యూరో: పల్నాడు జిల్లాలో కృష్ణా నదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కోనూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం, ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు.
Also Read: పొలిటికల్ లవర్ బాయ్ దువ్వాడా దారెటు…!!
ప్రమాద వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ సహాయాన్ని వెంటనే బాధిత కుటుంబాలకు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు కలిసి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.
Also Read: పెద్ది ఐటెం సాంగ్పై ట్రోల్స్.. అనంత శ్రీరామ్ ఘాటు రిప్లై…!
ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న పడవ ఒక ఇసుక దిబ్బను ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గంధం శైను, గంధం సంధ్య, బత్తుల కార్తీక్, కాంతం చైతన్యలు నీటిలో మునిగి మృతి చెందారు. పడవలో ఉన్న మరో ఆరుగురిని స్థానికులు, సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు.
మృతదేహాలను నది నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: వీడని మిస్టరీ- చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) జాడ కోసం గాలింపు చర్యలు వేగవంతం
స్థానికుల వివరాల ప్రకారం, కోనూరులోని బంధువుల ఇంట్లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన కుటుంబ సభ్యులు సరదాగా పడవ విహారానికి వెళ్లారు. అయితే ఆ ఆనంద క్షణాలు క్షణాల్లోనే విషాదంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లముందే పిల్లలు నదిలో మునిగిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.
ఈ విషాద ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Also Read: చల్లగా ఉంటాయని తాగుతున్నారా..? మీ ఆరోగ్యానికి ప్రమాదమే…!