-
అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం
-
ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
–నాంపల్లి సిఐ దూది రాజు
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను, చింతపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి, నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిఐ దూది రాజు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావని, సమాజంలోని అసమానతలను తొలగించి, అందరికీ సమాన హక్కులు కల్పించిన, మహనీయుడని ఆయన సేవలను కొనియాడారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
అనంతరం ప్రజా రక్షణే ధ్యేయంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా, నాంపల్లి సర్కిల్ పరిధిలోని చింతపల్లి మండలం పరిధిలోని పోలేపల్లి, కుర్మేడ్, నర్సర్లపల్లి, నాంపల్లి మండలాల్లోని ప్రమాదకరమైన మలుపులు, బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ ట్రాఫిక్ పోలీస్ కటౌట్లతో కూడిన, ప్రత్యేక సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై ఆయన అవగాహన కల్పించారు. రహదారి నిబంధనలు పాటించడం కేవలం చట్టం కోసం కాదని, ప్రతి ఒక్కరి ప్రాణ రక్షణ కోసమని గుర్తు చేశారు.
మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యల వల్ల, అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని కోరారు. ప్రజల బాధ్యతాయుత ప్రవర్తన వల్లనే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని వివరిస్తూ,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని, కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, క్షేమంగా ఇంటికి చేరాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎస్ఐ ముత్యాల రాంమూర్తి ఉన్నారు..
