విశాఖ జిల్లాలో మహిళపై వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య అందంగా లేదంటూ నిరంతరం అవమానిస్తూ, కట్నం కోసం ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపిస్తూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, శివాజీపాలేనికి చెందిన జోత్స్నరాణి అనే యువతికి 2020లో కెనడాలో ఉద్యోగం చేస్తున్న సందీప్తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షల నగదు, సుమారు 40 తులాల బంగారం కట్నంగా ఇచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
కూతురు భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆశించి వివాహం జరిపించామని, అయితే పెళ్లి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తల్లిదండ్రులు వాపోయారు. చిన్నచిన్న విషయాలపై గొడవలు పెట్టడమే కాకుండా, ‘అందంగా లేవు’ అంటూ మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు.
ఇంకా అదనపు డబ్బు, ఆస్తి కోసం కూడా ఒత్తిడి తెస్తున్నాడని వారు పేర్కొన్నారు. వేధింపులు తాళలేకపోయిన జోత్స్నరాణి తన తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇటీవల ఇలాంటి కట్న వేధింపుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే పోలీసులకు లేదా మహిళా హెల్ప్లైన్కు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. మానసిక వేధింపులు కూడా చట్టపరంగా నేరమేనని గుర్తు చేస్తున్నారు.
also read: షాబాద్లో క్రూరహత్యలు: పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురి హత్య – బాలికపై అత్యాచారం, ఆపై దారుణం