నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెంలో ఓ ఇంటి ముందు అనుమానాస్పద వస్తువులు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ముందు మనిషి వెన్నుముకతో పాటు పలు వస్తువులను ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన కుటుంబీకులకు వెన్నుముక, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, జిల్లేడు, రాగి, మర్రి ఆకులు తదితర వస్తువులు కనిపించాయి. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనను క్షుద్రపూజలకు సంబంధించినదిగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి ముందు ఆ వస్తువులను ఎవరు ఉంచారు? ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సమాచారం, అందుబాటులో ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో దేవునిగూడెం గ్రామంలో కొంతసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
also read: గ్రేటర్ నోయిడాలో విషాదం.. ఆరేళ్ల బాలిక హత్య
