ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ క్రికెటర్ సంజూ శాంసన్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మదన్ లాల్ ఖురానా ఫౌండేషన్ ఆధ్వర్యంలోని మోతీ నగర్ జన్ కౌశల్ కేంద్రానికి సంజూ శాంసన్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు ప్రకటించారు. ఢిల్లీ జట్టుతో కొత్తగా అనుబంధం ఏర్పరుచుకున్నందుకు సీఎం ఆయనకు అభినందనలు తెలిపారు.
సంజూ శాంసన్కు ఢిల్లీతో చిన్ననాటి నుంచే ప్రత్యేక అనుబంధం ఉందని రేఖా గుప్తా పేర్కొన్నారు. తన క్రికెట్ ప్రయాణానికి ఢిల్లీలోనే ప్రారంభ దశలు ఏర్పడ్డాయని ఆమె తెలిపారు. ఇప్పుడు జన్ కౌశల్ కేంద్రానికి బ్రాండ్ అంబాసిడర్గా సంజూ వ్యవహరిస్తూ.. యువతలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం, మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవడం, స్వావలంబన దిశగా ముందుకు సాగడం వంటి అంశాలపై స్ఫూర్తి కల్పిస్తారని సీఎం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ ఖురానాతో పాటు ట్రినిటీ ఫౌండేషన్, ఐఏసీటీ ఎడ్యుకేషన్కు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
‘విరాసత్ క్లబ్ స్కీమ్’ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా సీఎం రేఖా గుప్తా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఢిల్లీ చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై అవగాహన కల్పించేందుకు ‘విరాసత్ క్లబ్ స్కీమ్’ను ప్రారంభించారు.
మొదటి దశలో 75 ‘సీఎం శ్రీ’ పాఠశాలల్లో విరాసత్ క్లబ్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. భవిష్యత్లో ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించే ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్, పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా పాల్గొన్నారు.
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లతో సీఎం భేటీ
ఇదిలా ఉండగా.. ఛత్తీస్గఢ్కు చెందిన యువ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లతో రేఖా గుప్తా ఢిల్లీ సచివాలయంలో సమావేశమయ్యారు. ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్న వీరు.. ఢిల్లీ అభివృద్ధి, ప్రత్యేకతలను తమ సృజనాత్మక కంటెంట్ ద్వారా విస్తృతంగా పరిచయం చేస్తారని సీఎం తెలిపారు.
ఒకే రోజున సంజూ శాంసన్తో భేటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం, విద్యార్థుల కోసం వారసత్వ క్లబ్ల ప్రారంభం, డిజిటల్ క్రియేటర్లతో సమావేశం వంటి కార్యక్రమాలతో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా బిజీగా గడిపారు.
