హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని గోపన్పల్లిలో నాలుగంతస్తుల భవనం ప్రమాదకరంగా ఒకవైపునకు ఒరిగిపోవడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న ఆందోళనతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు.
స్థానిక సమాచారం ప్రకారం.. సుమారు 50 గజాల స్థలంలో నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఆ భవనం ఒకవైపునకు వాలిపోవడంతో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండటంతో దాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా భవనం సమీపంలోని ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భవనం కూలితే తమ ఇళ్లకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన నేపథ్యంలో గోపన్పల్లి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రమాదాన్ని నివారించేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.
also read: రూ.1.45 కోట్ల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మీ గణపతి.. పాల్వంచలో ప్రత్యేక ఆకర్షణ
