క్రైమ్ మిర్రర్ : విజయవాడ ఆటోనగర్లోని ఓ హ్యుందాయ్ కార్ల షోరూమ్లో భారీగా మంటలు చెలరేగాయి. ఆదివారం సెలవు కావడంతో షోరూమ్లో సిబ్బంది, కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షోరూమ్ భవనం పైభాగంలో ఒక్కసారిగా మంటలు ప్రారంభమై కొద్దిసేపటికే పైఅంతస్తు మొత్తం వ్యాపించాయి. మంటలతో పాటు దట్టమైన పొగ వెలువడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పలు ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. కొంతసేపటి తర్వాత మంటలను నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఆదివారం సెలవు కారణంగా షోరూమ్ ఖాళీగా ఉండటంతో ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో షోరూమ్ పనిచేస్తుంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు.
ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా షోరూమ్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు పూర్తిగా చల్లారిన అనంతరం నష్టాన్ని అధికారులు అంచనా వేయనున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయాన్ని నిర్ధారించేందుకు అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి విచారణ కొనసాగిస్తున్నారు.
also read : కల్తీ మద్యం కలకలం.. 11 మంది మృతి
