క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- వచ్చే ఐపీఎల్ సీజన్లో “ఇంపాక్ట్ ప్లేయర్” నిబంధనను కొనసాగించాలా వద్దా అనే విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే ముందు ఐపీఎల్లోని మొత్తం 10 ఫ్రాంచైజీల అభిప్రాయాలను బీసీసీఐ కోరింది. గత మూడేళ్లుగా అమల్లో ఉన్న ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై ఇటీవల పలు విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ, ఈ నిబంధనపై సమీక్ష జరుపుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అన్ని ఫ్రాంచైజీల నుండి బీసీసీఐ ఫీడ్బ్యాక్ అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై ఫ్రాంచైజీలు తమ నిర్ణయాన్ని, అభిప్రాయాలను ఈ రోజు లోగా బీసీసీఐకి తెలియజేయాల్సి ఉంది. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైనే కాకుండా, అంపైరింగ్ ప్రమాణాలు, ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహణ తదితర కీలక అంశాలపైన కూడా ఫ్రాంచైజీల నుండి బీసీసీఐ అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా వచ్చే సీజన్ ఐపీఎల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.
నాలుగేళ్ల విరామం తర్వాత టాలీవుడ్కు తిరిగి రానున్న నటి తాప్సీ పన్ను!
పెళ్లి ఇంట్లో హిజ్రాల రచ్చ.. హైదరాబాద్లో శృతిమించుతున్న బలవంతపు వసూళ్ల పర్వం!
