క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత టెస్టు జట్టుపై, ఆటగాళ్ల ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగా బదులిచ్చారు. జట్టు ఆటతీరు పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విమర్శకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన కొట్టిపారేశారు. ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపిస్తున్న గంభీర్.. తన లక్ష్యం కేవలం విజయాలు సాధించడమేనని స్పష్టం చేశారు.”ప్రస్తుతం భారత జట్టు ఒక పరివర్తన (ట్రాన్సిషన్) దశ గుండా వెళ్తోంది. ఆటగాళ్లు కొత్త వాతావరణానికి, వ్యూహాలకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని అవాంతరాలు, ఎదురుదెబ్బలు తగలడం సహజం. ఇటీవల ఎదురైన కొన్ని పరాజయాలను చూసి అది పెద్ద సంక్షోభం అని భావించకూడదు. టెస్టుల్లో మా ఆటతీరుపై మాకు ఎలాంటి ఇబ్బంది లేదా సందేహాలు లేవు. నిజానికి గత ఇంగ్లాండ్ పర్యటన నుంచే మేము అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నాం,” అని గంభీర్ వివరించారు.జట్టు ర్యాంకింగ్స్ గురించి వస్తున్న ప్రశ్నలపై గంభీర్ తనదైన శైలిలో స్పందించారు.
“నా దృష్టిలో ర్యాంకింగ్స్ అనేవి పెద్ద విషయమే కాదు. అంకెలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి, నేను వాటిని అసలు పట్టించుకోను. టీమిండియా కోచ్గా నా పని, నా ప్రధాన లక్ష్యం ఒక్కటే.. అది జట్టుకు ట్రోఫీలు అందించడం. నేను నమ్మేది, ఆశించేది, రేయింబవళ్లు శ్రమించేది కేవలం విజయాల కోసమే. ట్రోఫీలు గెలిచినప్పుడే జట్టు అసలైన సత్తా నిరూపితమవుతుంది,” అని ఆయన కుండబద్దలు కొట్టారు. గంభీర్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఆటగాళ్లలో విజయకాంక్షను రగిల్చేలా ఆయన మాటలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే, రేపు శ్రీలంకతో భారత్ తన రెండో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా సన్నద్ధమయ్యాయి. గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మ్యాచ్పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచ్లో చేసిన తప్పులను సరిదిద్దుకుని, లంకపై పూర్తి ఆధిపత్యం చెలాయించి సత్తా చాటాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
తెలంగాణ సినిమాలంటే తాగుడు, తినుడు, పంచాయితీలేనా.. రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
