Homeఅంతర్జాతీయంచీకట్లో బంగ్లాదేశ్.. చమురు కొరతతో అల్లాడుతున్న ప్రజలు, భారత్‌ సాయం కోరిన ప్రభుత్వం

చీకట్లో బంగ్లాదేశ్.. చమురు కొరతతో అల్లాడుతున్న ప్రజలు, భారత్‌ సాయం కోరిన ప్రభుత్వం

క్రైమ్ మిర్రర్: బంగ్లాదేశ్‌ తీవ్ర విద్యుత్‌ సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 9 నుంచి 10 గంటల వరకు పవర్‌ కట్స్‌ నమోదవుతున్నట్లు సమాచారం. ఉక్కపోత, వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే విద్యుత్‌ కోతలు పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ సుమారు 18 వేల మెగావాట్ల వరకు ఉండగా.. అందుకు తగ్గ స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడటంతో అనేక ప్రాంతాల్లో తరచూ కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పవర్‌ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత

విద్యుత్‌ కోతలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్థానిక విద్యుత్‌ పంపిణీ కేంద్రాలు, పవర్‌ స్టేషన్ల వద్ద నిరసనలు, దాడులు జరిగినట్లు సమాచారం. దీంతో విద్యుత్‌ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. సంక్షోభాన్ని కొంతమేర తగ్గించేందుకు పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌ను తగ్గించినట్లు తెలుస్తోంది. అలాగే విద్యుత్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు ఢాకాతో పాటు పలు నగరాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

రైతులు, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం

విద్యుత్‌ కొరత ప్రభావం వ్యవసాయం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. సాగునీటి పంపులు పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పరిశ్రమల్లో ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కూడా విద్యుత్‌ కోతల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

చమురు కొరతే ప్రధాన కారణమా?

బంగ్లాదేశ్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి ఇంధనంపై గణనీయంగా ఆధారపడాల్సి వస్తోంది. దేశం తన చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటోంది. అదే సమయంలో గ్యాస్‌ అవసరాల్లో కొంత భాగం కూడా విదేశీ సరఫరాలపై ఆధారపడి ఉంది. అయితే తగినంత ఇంధనం అందుబాటులో లేకపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడపలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఫలితంగా విద్యుత్‌ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేక సంక్షోభం మరింత తీవ్రతరమవుతోంది.

భారత్‌ వైపు చూసిన బంగ్లాదేశ్‌

విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు బంగ్లాదేశ్‌ భారత్‌ సాయం కోరినట్లు సమాచారం. ముఖ్యంగా విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన డీజిల్‌ను భారీ మొత్తంలో సరఫరా చేయాలని భారత్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు గతంతో పోలిస్తే అంత సానుకూలంగా లేకపోయినప్పటికీ.. గతంలో భారత్‌ బంగ్లాదేశ్‌కు డీజిల్‌ సరఫరా చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజా విజ్ఞప్తిపై భారత్‌ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇంధన కొరత, పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌, ఉత్పత్తిలో అంతరాయం వంటి సమస్యలు కొనసాగితే బంగ్లాదేశ్‌లో విద్యుత్‌ సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది.
also read : ఆస్పత్రి టాయిలెట్‌లో నర్సు అనుమానాస్పద మృతి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు