స్మార్ట్ఫోన్.. నేటి రోజుల్లో జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అవసరాలకు మించి గంటల తరబడి ఫోన్ వినియోగించడం మాత్రం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. తాజాగా సీనియర్ నటి షకీలా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడిస్తూ ఫోన్ వినియోగదారులను అప్రమత్తం చేశారు.
షకీలా తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా మంచంపై సరైన భంగిమలో కాకుండా పడుకుని గంటల తరబడి ఫోన్లో రీల్స్ చూడటం, గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. టీ, కాఫీ కోసం మాత్రమే మధ్యలో విరామం తీసుకునేవారని, మిగిలిన సమయంలో ఎక్కువగా ఫోన్తోనే గడిపేవారని చెప్పారు.
ఈ అలవాటు కారణంగా మెడపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి నరాల సంబంధిత సమస్య తలెత్తిందని ఆమె వెల్లడించారు. పరిస్థితి తీవ్రమవడంతో చివరకు మెడకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఆపరేషన్కు సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయిందని పేర్కొన్నారు.
శస్త్రచికిత్స అనంతరం తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. మంచం దిగడం, ఆహారం తీసుకోవడం వంటి సాధారణ పనులకు కూడా ఇతరుల సహాయం అవసరమవుతోందని తెలిపారు. తాను ఎదుర్కొన్న బాధ మరెవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నానని పేర్కొన్నారు.
ఫోన్ వినియోగంపై షకీలా కీలక సూచనలు
అతిగా స్మార్ట్ఫోన్ వాడటం మానుకోవాలని షకీలా సూచించారు. ముఖ్యంగా మంచంపై గంటల తరబడి వంగి లేదా తప్పు భంగిమలో ఫోన్ చూడకూడదని హెచ్చరించారు. స్క్రీన్ టైమ్ను తగ్గించుకోవడంతో పాటు మధ్య మధ్యలో విరామాలు తీసుకోవాలని కోరారు.
పిల్లలు ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లతో గడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్న వయసు నుంచే సరైన స్క్రీన్ వినియోగ అలవాట్లు పెంచుకోవడం ముఖ్యమని చెప్పారు.
షకీలా అనుభవం స్మార్ట్ఫోన్ వినియోగంపై ఒక ముఖ్యమైన హెచ్చరికగా నిలుస్తోంది. ఫోన్ అవసరమైన సాధనమే అయినప్పటికీ.. దాని వినియోగం మన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే స్థాయికి చేరకుండా జాగ్రత్తపడటం ప్రతి ఒక్కరి బాధ్యత.
also read: కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూత.. విషాదంలో కేసీఆర్ కుటుంబం
