కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ సినిమా విజయంతో మంచి జోష్లో ఉన్న ఆయన ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఇది సూర్య కెరీర్లో 48వ చిత్రం. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ఆయన తొలిసారి నటించనున్నారు. కేజీఎఫ్, కాంతార వంటి భారీ విజయాలను అందించిన ఈ సంస్థతో సూర్య చేయనున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో సూర్య, జ్ఞానవేల్ కాంబినేషన్లో వచ్చిన ‘జై భీమ్’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. దీంతో వీరి కలయికలో వస్తున్న కొత్త సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఈ సినిమాలో హీరోయిన్గా యువ నటి కయాదు లోహర్ ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా విజయంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ‘అల్లూరి’ తర్వాత ‘ఫంకీ’ సినిమాలో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు.
ప్రస్తుతం కయాదు లోహర్ ఆశలన్నీ నాని హీరోగా రూపొందుతున్న ‘ప్యారడైజ్’ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఆమె కెరీర్ మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో సూర్య వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడం ఆమెకు మరో పెద్ద మైలురాయిగా మారింది.
కెరీర్ ప్రారంభ దశలోనే రెండు పెద్ద ప్రాజెక్టుల్లో నటించే అవకాశం రావడం కయాదు లోహర్కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టి.జె. జ్ఞానవేల్ సినిమాల్లో మహిళా పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉండటం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.