రంగారెడ్డి శంకర్ పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక జీవితాన్ని ముగించుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
గ్రామానికి చెందిన బాల సాయి చారి(32) ఫోటోగ్రఫీ వృత్తితో కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి పద్మ(25) అనే యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఉపాధి కోసం వారు సంగారెడ్డి జిల్లా పరిధిలో అద్దె ఇంట్లో నివసిస్తూ సాధారణ జీవితం గడిపారు. ఈ దంపతులకు ఐదు నెలల పసిబిడ్డ కూడా ఉంది.
కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన వారు పాత ఇంట్లో ఉంటుండగా, ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో అత్యంత కలచివేసే విషయం ఐదు నెలల పసిబిడ్డ అనాథగా మారడం. తల్లిదండ్రులు ఏమైందో తెలియని ఆ చిన్నారి అమాయకంగా చుట్టూ చూస్తూ ఉండటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.
also read: హైదరాబాద్లో నిరుద్యోగుల ఆందోళన: పోలీసు నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్