క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, మరోవైపు సాయంత్రం వేళల్లో వరుణుడు పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు:- వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయి. ఉత్తర మరియు తూర్పు తెలంగాణ:- ఈ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40°C నుండి 42°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్లో కూడా ఎండ ప్రభావం గట్టిగానే ఉండనుంది. ఇక్కడ గరిష్టంగా 38°C వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొంత ఉపశమనం లభించనుంది.ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు ప్రాంతాలలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొద్దిసేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం/రాత్రి వేళల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వానలు పడేందుకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.ప్రజలకు సూచనలు:మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని, శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా తగినన్ని నీళ్లు తాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.