అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. వాయవ్య ప్రాంతంలోని ఇదాహో రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ట్విన్ ఫాల్స్ నగరంలో ఉన్న ఒక ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన అనుమానితుడు కూడా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అతను ఎలా మరణించాడనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. నిందితుడి గుర్తింపు, దాడి వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజల భద్రత దృష్ట్యా, ఘటన స్థలానికి సమీపంలోని కొన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేసి, ఆ ప్రాంతానికి రావద్దని అధికారుల సూచించారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు వరుసగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల భద్రతపై మళ్లీ చర్చకు దారితీస్తోంది.
also read: ‘సారీ హృతిక్’ ట్రెండ్పై క్లారిటీ: హృతిక్ రోషన్ స్పందన వైరల్
