దేశంలో పెరుగుతున్న అక్రమ వలసలు, సరిహద్దు చొరబాట్లు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో జరుగుతున్న అసాధారణ జనాభా మార్పులను అధ్యయనం చేసేందుకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక
అక్రమ వలసలు దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులు భవిష్యత్తులో సమస్యలకు దారితీయొచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఈ కమిటీని నియమించినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ
ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహించనున్నారు. సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ప్రముఖ ఆర్థికవేత్త షమిక రవి, జనగణన కమిషనర్ పనిచేయనున్నారు.అలాగే హోంశాఖ సంయుక్త కార్యదర్శి సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
కమిటీ ఏ అంశాలను అధ్యయనం చేస్తుంది?
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మతపరంగా, సామాజిక వర్గాల వారీగా జనాభాలో చోటుచేసుకుంటున్న అసాధారణ మార్పులను కమిటీ పరిశీలించనుంది. అక్రమ వలసలు, చొరబాట్లు, ఇతర కారణాల వల్ల ఏ ప్రాంతాల్లో ఎంత ప్రభావం పడుతోంది అనే అంశంపై డేటా సేకరించి అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ కేవలం సమస్యలను గుర్తించడం మాత్రమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కారాలపై కూడా సిఫారసులు చేయనుందని అమిత్ షా తెలిపారు. చట్టపరమైన మార్పులు, సరిహద్దు భద్రత బలోపేతం, జనాభా డేటా పర్యవేక్షణ వంటి అంశాలపై సూచనలు ఇవ్వనుంది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ తరహా కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు దిశగా తీసుకెళ్లింది.